
D Spiritual: Jan 29: మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. 2026 జనవరి 29 గురువారం ఈ పవిత్రమైన భీష్మ ఏకాదశి వచ్చింది. ఈ రోజున ఉపవాసం చేయడం చాలా శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అన్నం తీసుకోకుండా పాలు, పండ్లతో ఉపవాసం పాటించాలని సంప్రదాయం.
మాఘ మాసం శుక్ల పక్షంలోని అష్టమి రోజున భీష్ముడు తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజును భీష్మాష్టమిగా పిలుస్తారు. అయితే భీష్ముడి మహాత్మ్యాన్ని గుర్తించి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ప్రత్యేక ఏకాదశిని కేటాయించాడు. అదే భీష్మ ఏకాదశి. కృష్ణుడు స్వయంగా ఏర్పాటు చేసిన ఈ ఏకాదశి కావడంతో దీనికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశిగా భావిస్తారు.
భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా లేదా విన్నా కోట్ల జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. అనేక జన్మల శాపాల నుంచి విముక్తి లభించవచ్చని, కర్మ ఫలితాల తీవ్రత తగ్గుతుందని పురాణాలు చెబుతాయి. విష్ణుమూర్తి అనుగ్రహంతో అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.
ఈ రోజున అన్నం తినకూడదని శాస్త్రోక్తంగా చెబుతారు. ఇందుకు మూడు కారణాలు పేర్కొంటారు. భవిష్య పురాణం ప్రకారం ఏకాదశి నాడు పాపపురుషుడు బియ్యంలో నివసిస్తాడని, అందువల్ల అన్నం తింటే అపశుభం కలుగుతుందని నమ్మకం. అలాగే బియ్యంలో ఉన్న తామసిక గుణాలు బద్ధకాన్ని పెంచి పూజలకు ఆటంకం కలిగిస్తాయని చెబుతారు. చంద్రుడి ప్రభావం వల్ల ఈ రోజున జీర్ణక్రియ మందగిస్తుందని కూడా అంటారు.
భీష్మ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం ఉత్తమం. అన్నం తీసుకోకుండా పాలు, పండ్లు మాత్రమే స్వీకరించాలి. రాత్రికీ పాలు, పండ్లే తీసుకోవడం మంచిది. మరుసటి రోజు స్నానం చేసి శ్రీకృష్ణుడిని పూజించిన తర్వాత భోజనం చేయాలి.
పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఉదయం పాలు, పండ్లు తీసుకుని రాత్రికి గోధుమ రవ్వతో చేసిన ఉప్మా వంటి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. దీనిని “హరి నక్తం” అంటారు. ఇలా చేసినా కూడా ఏకాదశి ఉపవాస ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
