
D Spiritual: Jan 22: రథ సప్తమిని వైభవంగా నిర్వహించాలి – టీటీడీ ఈవో
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో జనవరి 25న జరగనున్న రథ సప్తమిని అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య భవన్లో సమీక్ష సమావేశం
తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం టీటీడీ అదనపు ఈవోలు, జిల్లా అధికారులు, టీటీడీ అధికారులతో శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రథ సప్తమి ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.
భక్తుల సహకారంతో విజయవంతమైన ఉత్సవాలు
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, టీటీడీ అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయడం వల్లే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతమయ్యాయని తెలిపారు. భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యవంతమైన దర్శనం, మెరుగైన సదుపాయాలు కల్పించగలిగామని వివరించారు.
అన్నప్రసాదాలు – భద్రతపై ప్రత్యేక దృష్టి
రథ సప్తమి రోజున శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులు, క్యూలైన్లు, బయటి ప్రాంతాల్లో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రతకు పెద్దపీట వేయాలని, టీటీడీ భద్రతా విభాగం, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనంగా 5 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా నిల్వ ఉంచాలని ఆదేశించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు – వాహన సేవల వివరణ
భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. ప్రతి వాహన సేవ ముందు ఆయా వాహనాల ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేసేలా వ్యాఖ్యాతలను నియమించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు.
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల రద్దు
రథ సప్తమి సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు. అలాగే ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
సర్వదర్శనం టోకెన్లు, వీఐపీ దర్శనాలపై నిర్ణయం
తిరుపతిలో జనవరి 24 నుంచి 26 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రోటోకాల్ ప్రముఖులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న అధికారులు
ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, తిరుపతి కమిషనర్ మౌర్య, సీవీఎస్వో కె.వి.మురళీకృష్ణతో పాటు టీటీడీ, జిల్లా, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
