
DNews: Jan 07: హైదరాబాద్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మెడిపల్ల గ్రామానికి చెందిన 17 ఏళ్ల పూజ మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి కారణమని కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన మహేష్ బుధవారం బ్రహ్మణపల్లె గ్రామంలో పెట్రోల్ పోసుకుని తనను తాను తగలబెట్టుకున్నాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. గతంలో కూడా వీరిద్దరూ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు. కొంతకాలంగా పూజ, మహేష్ ప్రేమలో ఉన్నారని సమాచారం. ప్రేమలో విఫలమవడం, పెద్దలు అంగీకరించకపోవడం వంటి కారణాలతో యువతలో ఆత్మహత్యలు, హత్యలు పెరుగుతున్నాయి. కొందరు మోసపోయామంటూ ప్రాణాలు తీసుకుంటుండగా, మరికొందరు పెద్దల నిరాకరణతో జీవితాలను ముగించుకుంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
