
D Spiritual: Dec 24: హిందువులు ఇంట్లో నిత్యంగా దీపారాధన చేస్తుంటారు. దీపారాధనతో పాటు పూజ పూర్తైన తర్వాత కర్పూరాన్ని వెలిగించడం కూడా ఒక ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. ప్రతిరోజూ కర్పూరం వెలిగించకపోతే పూజ సంపూర్ణం కాదని చాలామంది విశ్వసిస్తారు. అందుకే పూజ ముగిసిన అనంతరం కర్పూరంతో దేవుడికి హారతి ఇవ్వడం తప్పనిసరిగా చేస్తారు.
అయితే పూజ పూర్తయిన తర్వాత దేవుడికి హారతి ఎందుకు ఇవ్వాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది. హారతి ఇచ్చేటప్పుడు భక్తులు కొద్దిగా కర్పూరాన్ని కళ్లకు అద్దుకుంటారు. ఇలా చేయడం వల్ల మనసుకు ఒక విధమైన ప్రశాంతత కలుగుతుందని అనుభవం చెబుతుంది. హారతి సమయంలో సాధారణంగా గంటను మోగించడం కూడా జరుగుతుంది.
ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని భక్తి భావంతో నమస్కరిస్తారు. కొన్ని ప్రాంతాల్లో శంఖాన్ని ఊదే సంప్రదాయం కూడా ఉంది. గంటలు, శంఖం శబ్దాల వల్ల మనస్సులోని ఇతర ఆలోచనలు తొలగిపోయి, పూర్తిగా భగవంతుడిపై ధ్యాస కేంద్రీకృతమవుతుంది. దీనివల్ల శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కొని, నూతన ఉత్తేజం కలుగుతుందని విశ్వాసం.
పూర్వకాలంలో ఆలయాల్లో కృత్రిమ దీపాలు ఉండేవి కావు. రాతితో నిర్మించిన ఆలయాల్లో గాలి చొరబడకపోవడం వల్ల తేమ అధికంగా ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో దుర్వాసనలు, సూక్ష్మక్రిములు ఏర్పడటం సహజం. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉందని ప్రాచీన వైద్యులు నమ్మేవారు. అప్పట్లో కర్పూరాన్ని చెట్ల నుంచే సేకరించేవారు.
ఒకప్పుడు ఫలపుష్పార్చన, ధూపదీపాలు అన్నీ ప్రకృతి సిద్ధమైన పదార్థాలతోనే నిర్వహించేవారు. పూజ మొత్తం ప్రకృతితో అనుసంధానమై సాగేది. భగవంతుడికి ఇచ్చిన హారతిని కళ్లకు అద్దుకోవడం ద్వారా, ఆయనను ప్రత్యక్షంగా తాకలేకపోయినా, హారతి ద్వారా ఆయన స్పర్శను అనుభవించినట్లుగా భక్తులకు తృప్తి కలుగుతుంది.
హారతితో పాటు ఘంటానాదం చేయడం సహజమైన ప్రక్రియ. కళ్లు మూసుకుని హారతిని కళ్లకు అద్దుకోవడం వల్ల మనసు, చెవులు, వాసన గ్రహించే శక్తి, స్పర్శ అనే ఇంద్రియాలన్నీ భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి. దీనివల్ల సంపూర్ణ ఏకాగ్రత ఏర్పడుతుంది.
శాస్త్రీయంగా చూస్తే హారతి పళ్లెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం వంటి పదార్థాలను ఉంచుతారు. పత్తి స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. నెయ్యి, కర్పూరం వెలిగించినప్పుడు సుగంధ పరిమళాలు వెలువడి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
ఈ సువాసనల వల్ల ఆ ప్రదేశమంతా సానుకూల శక్తితో నిండి, ప్రతికూల శక్తులు దూరమవుతాయని నమ్మకం. అక్కడ ఉన్నవారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అందుకే హారతిని ప్రశాంతతకు, పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు.
