
D Spiritual: Dec 15: వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభం నుంచి శబరిమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటుండటంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది.
ఈ నేపథ్యంలో శబరిమలలో అరవణ పాయసం ప్రసాదానికి తీవ్రమైన కొరత ఏర్పడినట్లు దేవస్వం బోర్డు ప్రకటించింది. అందువల్ల అరవణ పాయసం ప్రసాదం డబ్బాల పంపిణీపై తాత్కాలిక పరిమితి విధిస్తున్నట్లు వెల్లడించింది.
దేవస్వం బోర్డు నిర్ణయం మేరకు ఒక్కో భక్తుడికి గరిష్టంగా 20 అరవణ పాయసం టిన్నులు మాత్రమే అందజేయనున్నట్లు తెలిపింది. ఒక్క టిన్ను ధర రూ.100గా నిర్ణయించారు. ఈ పరిమితికి సంబంధించిన సమాచారం భక్తులకు తెలియజేయడానికి అరవణ పాయసం పంపిణీ కౌంటర్ల ముందు బోర్డులు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతానికి అవసరమైనంత సంఖ్యలో ప్రసాదం డబ్బాలు అందుబాటులో లేవని, అందుకే ఈ పరిమితి విధించాల్సి వచ్చిందని దేవస్వం బోర్డు అధికారులు తెలిపారు.
అధిక సంఖ్యలో అరవణ పాయసం అమ్మకాలు జరగడం, అలాగే పంపిణీకి అవసరమైన టిన్నుల కొరతే ఈ ఆంక్షలకు ప్రధాన కారణమని అధికారులు వివరించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున ప్రసాదం డబ్బాలు కొనుగోలు చేయడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిందన్నారు.
అరవణ అమ్మకాలు ఉత్పత్తిని మించిపోతుండటంతో సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. సాధారణంగా రోజుకు 2.5 నుంచి 3 లక్షల టిన్నులు ఉత్పత్తి అవుతుంటే, ప్రస్తుతం రోజుకు సుమారు 4 లక్షల టిన్నులు అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో నిల్వ చేసిన దాదాపు లక్ష అరవణ టిన్నులను ప్రతిరోజూ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇదే స్థాయిలో అమ్మకాలు కొనసాగితే, రాబోయే కొన్ని రోజుల్లో అరవణ పాయసం సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని దేవస్వం బోర్డు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
అరవణ ప్రసాదం కొరతకు మరో ప్రధాన కారణంగా గత ఏడాది జనవరి 2024లో జరిగిన ఘటనను అధికారులు గుర్తు చేశారు. అప్పట్లో అరవణ పాయసంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, లక్షలాది అరవణ ప్రసాదం డబ్బాలను అధికారులు ధ్వంసం చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ పరిణామం కూడా ప్రస్తుత కొరతకు ఒక కారణమని వెల్లడించారు.
