
D Spiritual: Dec 15: దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టును టీటీడీ ప్రారంభించినట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్. నాయుడు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు.
ఈ విశిష్ట ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ప్రాచీన ఆగమశాస్త్రాలకు అనుగుణంగా హిందూ దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన పవిత్ర దివ్య వృక్షాలను టీటీడీ స్వయంగా పెంచి, సంరక్షించి వినియోగించడమేనని ఆయన వివరించారు. సంప్రదాయ పరిరక్షణతో పాటు స్వావలంబనను పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని చెప్పారు.
తిరుమల అభివృద్ధిపై ఏపీ ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన లక్ష్యాలకు అనుగుణంగానే ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టు రూపకల్పన చేయబడిందని శ్రీ బీ.ఆర్. నాయుడు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు ఇది నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
ధ్వజస్తంభం కేవలం ఒక నిర్మాణ భాగం మాత్రమే కాకుండా, భౌతిక లోకానికి మరియు దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా భావిస్తారు. ఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచే ధ్వజస్తంభం భక్తి, పవిత్రత మరియు దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుందని శాస్త్రాలు వివరిస్తాయి.
ఆగమశాస్త్రాల ప్రకారం ధ్వజస్తంభం నిటారుగా పెరిగిన ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో తయారు చేయాలి. ఆ వృక్షాన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య మరియు విధి విధానాలకు అనుగుణంగా ఎంపిక చేసి, సంవత్సరాల తరబడి సంరక్షించిన అనంతరం శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించి వినియోగిస్తారు.
ధ్వజస్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఏగిశా (ఇండియన్ కినో), టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను ఉపయోగిస్తారు. ఇవి బలంగా, దీర్ఘకాలం నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటంతో ధ్వజస్తంభాల నిర్మాణానికి అనుకూలంగా ఉంటాయి. పరిపక్వత చెందిన తరువాత ఆ వృక్షాన్ని పూజించి, ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు.
ఆపై ధ్వజస్తంభాన్ని కవచంతో కప్పి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వంటి పవిత్ర ఆలయాల్లో స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. రాజగోపురం మరియు గర్భగుడి విమానం మధ్య పవిత్ర స్థలంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు.
ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచకంగా జరిగే ధ్వజారోహణం, సమస్త లోకాలకు దేవతలను ఆహ్వానించే శుభ సూచకంగా భావించబడుతుంది. ఈ సంప్రదాయం ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందిస్తుంది.
దేశవ్యాప్తంగా 60కు పైగా ఆలయాలను నిర్వహిస్తున్న టీటీడీ, భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించాలనే దృష్టితో ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును ప్రారంభించింది.
ఈ ప్రాజెక్టు ద్వారా కాలక్రమేణా మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో శాస్త్రోక్తమైన కొత్త ధ్వజస్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో నిర్మించనున్న ఆలయాలకు అవసరమైన పవిత్ర కలపను ముందుగానే సిద్ధం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా టీటీడీ పేర్కొంది.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగా దివ్య వృక్షాల ప్రాజెక్టు కోసం సుమారు 100 ఎకరాల భూమిని కేటాయించాలని టీటీడీ బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమలుతో ధ్వజస్తంభాల కోసం అవసరమైన పవిత్ర వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ దేశ చరిత్రలో నిలవనుందని స్పష్టం చేసింది.
దీని ద్వారా ఆగమ శుద్ధి, ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యత మరియు సంస్థాగత స్వావలంబనను తరతరాలకు కొనసాగించగలుగుతామని టీటీడీ విశ్వాసం వ్యక్తం చేసింది.
