
DSports:17Sep:షెన్ జెన్: భారత స్టార్ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అద్భుతమైన ప్రదర్శనతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. టోర్నమెంట్ లో మొదటి రౌండ్ లో డెన్మార్క్ కు చెందిన జూలీ డవాల్ జాకోబ్ సెన్ పై ఘన విజయం సాధించి, ప్రీ-క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.
రౌండ్ 1లో సింధు విధ్వంసం
బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆమె కేవలం 27 నిమిషాల్లోనే 21-4, 21-10 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఈ విజయం సింధుకు ఎంతో ఉపశమనం కలిగించింది. ఈ ఏడాది సింధు వరుసగా ఆరు టోర్నమెంట్లలో మొదటి రౌండ్ లోనే నిష్క్రమించింది. ఇటీవల జరిగిన హాంకాంగ్ ఓపెన్ లో కూడా ఆమె డెన్మార్క్ కే చెందిన మరో క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫెర్సెన్ చేతిలో ఓటమి పాలైంది.
మంచి ఫామ్ లో సింధు
ఈ ఏడాది సింధు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ఇటీవల ప్రపంచ ఛాంపియన్ షిప్లో క్వార్టర్ ఫైనల్ కు చేరుకుని తన ఫామ్ ను తిరిగి పొందుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ టోర్నీలో సింధు చూపిన ఆధిపత్యం ఆమెను మళ్లీ గాడిలో పడిందని సూచిస్తుంది. మొదటి గేమ్ లో సింధు కేవలం 10 నిమిషాల్లోనే ఆటను ముగించింది. రెండవ గేమ్ లో కూడా ఆమె దూకుడు కొనసాగించింది.
ప్రీ-క్వార్టర్స్ లో సింధు థాయ్ లాండ్ కు చెందిన ఆరో సీడ్ పోర్న్ పవీ చోచువోంగ్ తో తలపడనుంది. వీరిద్దరి మధ్య గత మ్యాచ్ లలో సింధు 6-5 తేడాతో స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఇండోనేషియా ఓపెన్ లో చివరిసారి వీరిద్దరు తలపడినప్పుడు చోచువోంగ్ విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.ఇదే టోర్నమెంట్ లో, భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి తొలి రౌండ్ లో ఓటమి పాలయ్యాడు. పురుషుల డబుల్స్ లో రోహన్ కపూర్, రుత్వికా గద్దె కూడా ఓటమి చెందారు. కానీ, సింధు విజయం భారత్ కు ఆశలను సజీవంగా ఉంచింది.
