
D Spiritual: Dec 10: శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో జరిగే ఏడు గంగమ్మల జాతరను దేవస్థానం పాలకమండలి, జాతర కమిటీ నిర్వాహకులు సమన్వయంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టె సాయిప్రసాద్ పిలుపుతో మంగళవారం మధ్యాహ్నం జాతర ప్రారంభం కావడంతో, ఒక్కసారిగా వంద డప్పులు మోగి, కళాకారులు నృత్యాల మధ్య ఊరేగింపు సాగగా, ఆ దృశ్యం చూడటానికి వేయి కళ్లు చాలనంత అద్భుతంగా కనిపించింది.
ఏడు గంగమ్మల జాతరలో అలంకారాలు, ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఊరేగింపును ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ప్రారంభించారు. పెండ్లి మండపం నిర్వాహకులు కాసరం రమేష్, బేరివారి మండపం నిర్వాహకులు వజ్రం కిషోర్ సారథ్యంలో మండపాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. పెండ్లి మండపం వద్ద కాషాయ జెండాలు, రిబ్బన్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాలుగు మాడ వీధులు మొత్తం వెలుగులతో దిద్దుబాటు చేయబడి ఆకర్షణీయంగా మారాయి. ఊరంతా అరటి చెట్లు, గంగమ్మకు ఇష్టమైన వేపాకు తోరణాలతో ముస్తాబు చేసి జాతరకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. జాతర కమిటీ నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటుకోవడానికి పోటీపడటంతో జాతర మరింత వైభవంగా కనిపించింది.
శ్రీకాళహస్తి: ఏడు గంగమ్మల జాతరలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ఐదు గంటలకు అంగరంగ వైభవంగా సారె బహూకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి దంపతులు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్కుమార్, ఆయన సతీమణి విశాలాక్షి, చైర్మన్ కొట్టె సాయిప్రసాద్ దంపతులు, ఈవో డి. బాపిరెడ్డి హాజరై ఆలయాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధానార్చకులు సంబంధం, కరుణాకర్ గురుకుల్స్ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
వేదమంత్రోచ్చారణల మధ్య గంగమ్మలకు సారె సమర్పణ ఘనంగా జరిగింది. శివయ్య గోపురం నుంచి ప్రారంభమైన సారె ఊరేగింపు రాజగోపురం ద్వారా తేరువీధి వైపు సాగింది. సారెను తీసుకెళుతున్న అతిథుల కాళ్లకు ఇంటింటా భక్తులు పసుపు నీళ్ళు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలు వ్యక్తం చేశారు. పక్కనే భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ, గంగమ్మల పట్ల భక్తి ఉట్టిపడేలా దర్శనం పొందారు. అనంతరం సారెను ముత్యాలమ్మగుడి వీధిలోని ఏడు గంగమ్మల నిల్చు స్థలంలో సమర్పించారు. అక్కడ అతిథులకు కాసరం రమేష్ సారథ్యంలో ఘన స్వాగతం పలికారు.
సారె ఊరేగింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా డీఎస్పీ నరసింహామూర్తి, సిఐ ప్రకాష్ కుమార్, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు. బోర్డు సభ్యులు వాకచర్ల గుర్రప్పశెట్టి, దండి రాఘవయ్య, పగడాల మురళి, కౌసల్య తదితరులు పాల్గొన్నారు. ఆలయాధికారులు ఈవో డి. బాపిరెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శనం, పర్యవేక్షకులు నాగభూషణం, యాదవ్ తదితరులు కార్యక్రమం మొత్తం పర్యవేక్షించారు.
