
D Spiritual: Dec 10: టాలీవుడ్ సినీ నటి శ్రియ శరణ్ (Shriya Saran) కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న శ్రియ, బుధవారం ఉదయం తన కుమార్తెతో కలిసి వేకువజామున జరిగే అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
సుప్రభాత సేవ సమయంలో, శ్రియ తన కుమార్తె రాధ శరణ్ ను ఎత్తుకుని, తల్లి నీరజతో కలిసి భక్తిపూర్వకంగా సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు శ్రియ కుటుంబానికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు.
సంప్రదాయ వస్త్రధారణలో దర్శనానికి వచ్చిన శ్రియా, ఆలయం ముందు భక్తులను చూసి సంతోషంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వామివారి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగిందని, తన కుమార్తెకు శ్రీవారి ఆశీస్సులు లభించాయని తెలిపారు. అలాగే, తమ కొత్త చిత్రానికి శ్రీవారి దీవెనలు కోరుకున్నానని చెప్పారు.
ప్రతి సంవత్సరం శ్రీవారిని దర్శించుకునే ఆనవాయితీలో భాగంగానే ఈసారి సుప్రభాత సేవలో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని శ్రియ పేర్కొన్నారు.
