
D Spiritual: Dec 9: దేశంలో ఉన్న ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా భీమేశ్వర ఆలయానికి కూడా విశేష స్థానం ఉంది. దట్టమైన అడవిలో, ప్రకృతి ఒడిలో భీముడు ప్రతిష్టించిన ఆలయంగా ఈ భీమేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. సంతాయిపేటలో ఉన్న ఈ ఆలయం భీముడు ప్రతిష్ఠించినది కావడంతో భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు.
ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే అడవి మధ్యలో ప్రవహించే వాగును దాటి వెళ్లాలి. అలానే భక్తులు వాగును దాటేటప్పుడు సహజంగానే కాళ్లు శుభ్రం అవుతాయి. ఆలయంలో శివుడు పంచముఖంగా దర్శనమిస్తాడు. పండితులు పూజలు నిర్వహించిన తర్వాత భక్తులే స్వయంగా శివుడికి నీటితో అభిషేకం చేసే అవకాశం ఉంటుంది.
ఈ ఆలయ చరిత్ర ప్రకారం 12వ శతాబ్దంలో కాకతీయులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఆలయానికి ఉత్తర ముఖ ద్వారం ఉండటమే కాకుండా పడమర ముఖ ద్వారం కూడా ఉండటం ఒక ప్రత్యేకం. అలాగే దేశంలో అరుదుగా లభించే విధంగా ఈ భీమేశ్వరాలయంలో కుంతీదేవి ఆలయం కూడా ఉంది. సంతానం లేని వారికి కుంతీదేవి దర్శనం ద్వారా సంతానం లభిస్తుందని స్థానికుల నమ్మకం.
శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయంలోకి అడుగుపెడుతూనే పెద్ద మహానంది దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ నంది విగ్రహం సుమారు అర ఇంచు పెరుగుతుందని భక్తులు చెబుతుంటారు.
ఉత్తరం నుండి దక్షిణం వైపుకు పారే వాగు మధ్యలో భీమేశ్వర ఆలయం నిర్మాణం కావడంతో, ఈ వాగును “దక్షిణ గంగా” అని పిలుస్తారు. ఈ వాగులో మాఘ స్నానాలు, కార్తీక స్నానాలు, శ్రావణ స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
