
D Spiritual: Dec 9: శివాలయాల్లో నందీశ్వరుడి స్థానం అత్యంత ముఖ్యమైనది. నందీశ్వరుడి అనుమతి లేకుండా శివుడిని దర్శించుకోవడం ఫలితం ఉండదని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా నంది కొమ్ముల మధ్యగా శివలింగాన్ని దర్శించుకోవాలని సూచిస్తారు. ఈ విధంగా దర్శనం చేయడంలో ఉన్న పరమార్థం ఏమిటో, దర్శనం సమయంలో చెప్పాల్సిన ప్రత్యేక ప్రార్థన ఏమిటో తెలుసుకోవాలి.
శివుడి ఆలయ ప్రవేశద్వారంలో నందీశ్వరుడు ద్వారపాలకుడిగా నిలుస్తాడు. అందువల్ల శివుడిని దర్శించుకునే ముందు నందీశ్వరుడిని దర్శించుకోవడం శ్రేష్ఠం. భక్తుల కోరికలు నంది చెవిలో చెప్పినప్పుడు, అవి శివుడికి చేరుతాయని విశ్వాసం. అందుకే నందీశ్వరుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.
శివుడిని దర్శించుకునేటప్పుడు నంది కొమ్ములపై ఎడమచేతిని ఉంచి, వెనుకభాగాన్ని కుడి చేత్తో స్పృశిస్తూ దర్శనం చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు భక్తుడు తల వంచి వినయంతో నిలుస్తాడు. ఇది పరమేశ్వరునికి సర్వస్వ సమర్పణ చేసినట్లు భావిస్తారు. శివుడు త్రినేత్రుడు; ఆయన త్రినేత్రం తెరవడం బ్రహ్మాండాన్ని కదిలించగల శక్తి కలిగినది. అందువల్ల నేరుగా శివుడి ముందుకు వెళ్లకుండా, నంది కొమ్ముల మధ్యగా దర్శనం చేసి ఆపై అంతఃప్రవేశం చేయాలని శాస్త్ర సూచన. ఈ విధానాన్నే ‘శృంగదర్శనం’ అంటారు.
శివుడి దర్శనం సమయంలో భక్తుడు ప్రత్యేకంగా ఈ శ్లోకాన్ని పఠించడం శుభప్రదం:
‘‘నందీశ్వర నమస్తుభ్యం
శాంతానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్ధం
అనుజ్ఞాం దాతుమర్హసి’’
ఈ శ్లోకాన్ని చెప్పడం వేద పఠనం చేసినంత ఫలితాన్ని, సప్తకోటి మహామంత్ర జప ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నంది చెవిలో కోరికలను చెప్పేటప్పుడు కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, గోత్రం, పేరు, కోరిక నెమ్మదిగా చెప్పాలి. ఆ తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద ఉంచడం శుభం.
నంది కొమ్ముల మధ్యగా శివుడిని దర్శించిన వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని శివ పురాణంలో పేర్కొనబడింది.
