
D Spiritual: Dec 8: అయ్యప్ప మాల వేసుకున్న స్వాములను చూస్తే భక్తి పారవశ్యం కలుగుతుంది. ఎంతో నిష్టతో, కఠోర దీక్షలో 41 రోజులు భజనలు చేస్తూ, ఇతరులను “స్వామి” అని సంబోధించుకోవడం ఈ దీక్షలోని ప్రత్యేకత. దీక్ష పూర్తయిన తరువాత అయ్యప్ప భక్తులు శబరిమల సందర్శనకు బయలుదేరి, పవిత్రమైన పతినెట్టం పది (18 మెట్లు) ఎక్కి స్వామిని దర్శించుకోవడం ప్రధాన కర్మగా భావిస్తారు.
శబరిమలలోని ఈ 18 మెట్లు మతపరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. 41 రోజుల దీక్షను సంపూర్ణంగా పాటించినవారికి మాత్రమే ఈ మెట్లను అధిరోహించే అర్హత ఉంటుంది. మెట్లను ఎక్కేటప్పుడు కుడి పాదంతో ప్రారంభించాలి. భక్తులు ‘ఇరుముడి’ అనే నల్లని వస్త్రంతో కట్టిన పూజా సామాగ్రి, వ్యక్తిగత వస్తువుల మూటను తలపై వేసుకుని ప్రవేశించాలి. ఈ విధానం మనసును ప్రాపంచిక కోరికల నుండి దూరం చేస్తుందని నమ్మకం.
మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలను సూచిస్తాయి—దృష్టి, ధ్వని, వాసన, రుచి, స్పర్శ. తరువాతి ఎనిమిది మెట్లు అష్టరాగాలకు ప్రతీకలు. అవి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సర్యం, అసూయ, దంబం వంటి భావోద్వేగాలను జయించాలని సూచిస్తాయి. ఈ మెట్లు మనిషి చెడు మార్గం నుండి తప్పుకుని సత్పథంలో నడవాలని, నిరంతరం దేవుని స్మరించుకోవాలని ప్రబోధిస్తాయి.
తరువాతి మూడు మెట్లు సత్వ, రజో, తమో గుణాలను సూచిస్తాయి. సత్వం జ్ఞానాన్ని ప్రసాదిస్తే, రజస్సు మోహాన్ని కలిగిస్తుంది; తమస్సు అవివేకం, అజాగ్రత్త వైపు దారి తీస్తుంది. చివరి రెండు మెట్లు జ్ఞానం మరియు అజ్ఞానానికి సూచికలుగా భావిస్తారు. వీటిని అధిరోహించడం జీవన మార్గంలో అంతరంగ శుద్ధతను పొందడం అని భక్తులు విశ్వసిస్తారు.
పూర్వంలో ఈ మెట్లు గ్రానైట్తో నిర్మించబడ్డాయి. తరువాత వాటిని పంచలోహాలతో ప్రతిష్ఠించారు. అయ్యప్ప స్వామి 18 ఆయుధాలను ధరించేవాడన్న పురాణ నమ్మకం ప్రకారం, ప్రతి మెట్టు ఒక ఆయుధానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. శబరిమల చుట్టూ ఉన్న 18 కొండలు కూడా ఈ 18 మెట్లకు ప్రతిరూపాలుగా చెప్పబడాయి. అన్నికొండలలో ఎత్తైన స్థలంలో ఆలయం ఉండడం వల్ల దీని ఆధ్యాత్మికత మరింత ప్రకాశిస్తుంది.
