
D Spiritual: Dec 8: మీకు తెలుసా? ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారని విశ్వాసం ఉంది. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది. గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం. అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా ఇది ప్రసిద్ధి.
ఎందుకంటే ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారని అంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు ఏడు సార్లు మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. ప్రతిసారి నైవేద్యం కొంచెం తగ్గిపోయి కనిపించడం తరచూ గమనిస్తారు. స్వామివారు స్వయంగా తింటారు అన్న విశ్వాసం ఇక్కడి భక్తుల్లో బలంగా ఉంది. అలాగే అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుందనేది కూడా ఇక్కడి ప్రత్యేకత.
ఈ దేవాలయాన్ని తెల్లవారుజామున 2 గంటలకే తెరుస్తారు. సాధారణంగా ఆలయాల్లో అభిషేకం, అలంకరణ తర్వాత నైవేద్యం సమర్పిస్తారు. కాని ఇక్కడ ముందు నైవేద్యం సమర్పించి తరువాత అభిషేకం, అలంకరణ చేస్తారు. నైవేద్యం ఆలస్యమైనా లేదా ప్రధాన ద్వారం సమయానికి తెరవకపోయినా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో ఎల్లప్పుడూ గొడ్డలి ఉంటుంది. ఏదైనా కారణంగా తాళం పనిచేయకపోతే, గొడ్డలితో పగులగొట్టి ఆలయ ద్వారం తెరవడం ఇక్కడి ఆనవాయితీ.
కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామివారికి నివేదించిన తర్వాత భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ఎవ్వరూ ఆకలితో వెళ్లకూడదన్న ఆచారం ఇక్కడ చాలా కట్టుబాటుగా పాటిస్తారు. అందుకే “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా?” అని అర్చకులు గొంతెత్తి పిలుస్తారు. నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తగ్గట్టుగా కృష్ణుడి నడుము చుట్టూ ఉన్న ఆభరణం కొన్ని ఇంచులు క్రిందికి జారిపోతుందని చెబుతారు. గ్రహణం సమయంలో ఆలయం మూయడం వల్ల ఇలాంటి అపసృతులు జరగడంతో, ఇప్పుడు ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలో కూడా ఎప్పుడూ మూయరు.
గ్రహదోషాలు, గ్రహణదోషాలు, సంతానదోషాలు, సర్పదోషాలు, వ్యాపార నష్టాలు, వివాహదోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాపాలైనా సరే ఇక్కడి కృష్ణపరమాత్మను దర్శించి పూజిస్తే దోషాలు నివారమవుతాయని నమ్మకం. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణుని సేవకులే కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతకదోషాలు అంటవని చెబుతారు. సైంటిస్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఇక్కడ చోటుచేసుకున్నాయి. “భగవంతుడు ఉన్నాడు” అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప దేవాలయం ఎక్కడుంటుంది!
