
D Spiritual: Dec 8: ఉత్తరాఖండ్లో ప్రకృతి మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల అద్వితీయ సంగమాన్ని చూడవచ్చు. ఇక్కడి హిమాలయ పర్వత సౌందర్యం కనులకు విందిస్తే, ఆధ్యాత్మిక ప్రదేశాలు మనసుకు శాంతి, ఆనందాన్ని ఇస్తాయి. అటువంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రాల్లో కార్తీక స్వామి ఆలయం ఒకటి. ఎత్తైన శిఖరంపై వెలిసిన ఈ దేవాలయం వైభవం, పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు చుట్టూ విస్తరించిన గిరి దృశ్యాలతో భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది.
కార్తీక స్వామి దేవాలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది. రుద్రప్రయాగ–పోఖారి రహదారి పై కనక్ చౌరి గ్రామ సమీపంలోని క్రాంచ్ కొండపై ఇది 3050 మీటర్ల ఎత్తులో నిలిచివుంది. శివ–పార్వతుల కుమారుడైన కార్తికేయుడు ఇక్కడ బాల్యరూపంలో దర్శనం ఇస్తాడు. ఉత్తర భారతదేశంలో కార్తికేయుని బాలరూపం ఉన్న ఏకైక దేవాలయం ఇదే.
పురాణాల ప్రకారం ఒకసారి శివుడు తన కుమారులు కార్తికేయుడు మరియు గణేశుడిని విశ్వానికి ఏడు ప్రదక్షిణలు చేయమని ఆజ్ఞాపించాడు. తన తండ్రి మాట వినగానే కార్తికేయుడు వెంటనే ప్రయాణం ప్రారంభించాడు. కానీ గణపతి తన తల్లిదండ్రులను ఏడు ప్రదక్షిణలు చేసి, “నా విశ్వం మీరు ఇద్దరూ” అని చెప్పాడు. ఈ జ్ఞానం చూసి శివపార్వతులు గణేశుడిని సంతోషంతో ఆశీర్వదించి మొదటి పూజ అర్హతను ఇచ్చారు.
తన యాత్రను పూర్తి చేసి తిరిగి వచ్చిన కార్తికేయుడు విషయం తెలుసుకుని కోపగించుకొని, తన మాంసాన్ని–ఎముకలను శివుడికి అర్పించినట్టు పురాణాల్లో వర్ణిస్తారు. అందుకే ఈ దేవాలయంలో కార్తికేయుని ఎముకలకు పూజలు జరిగుతాయి. ఈ ఆలయం పురాణాల్లో సతీదేవి శక్తిపీఠాలలో ఒకటిగా కూడా ప్రస్తావించబడింది.
ఆలయం వద్ద వేలాడదీసిన వందలాది గంటల శబ్దం దూరంగా 800 మీటర్ల వరకూ వినిపిస్తుంది. రోడ్డు స్థాయి నుండి సుమారు 80 మెట్లు ఎక్కితే గర్భగుడి చేరుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల సందడి మరింతగా పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలో కార్తికేయుని మురుగన్ అని పిలుస్తారు; ఆయనకు ఇక్కడ కూడా అపారమైన భక్తి ఉంది.
కార్తీక స్వామి ఆలయానికి చేరుకోవాలంటే హరిద్వార్ లేదా రిషికేశ్ నుండి రుద్రప్రయాగకు బస్సు ప్రయాణం ఉత్తమ మార్గం. అక్కడి నుంచి పోఖారి మార్గంలో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రుద్రప్రయాగ్ నుండి టాక్సీ అద్దెకు తీసుకోవచ్చు లేదా షేర్డ్ టాక్సీలలో కూడా సులభంగా చేరుకోవచ్చు.
