
అఫ్గానిస్థాన్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకు ఒక్క మ్యాచ్లోనూ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కలేదు. జింబాబ్వే పర్యటనలో 151 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచినప్పటికీ.. సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్కే టీమిండియా మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నిర్ణయంపై చర్చ జరుగుతున్న వేళ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనిపై స్పష్టత ఇచ్చాడు.
సంజు శాంసన్ను ఇంగ్లాండ్ సిరీస్లో పక్కన పెట్టి వైభవ్కు అవకాశం ఇవ్వడం తన కోచింగ్ కెరీర్లో అత్యంత కఠినమైన నిర్ణయాల్లో ఒకటని గంభీర్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజు సామర్థ్యం గురించి తమకు పూర్తి అవగాహన ఉందని చెప్పాడు. ఒకటి రెండు సిరీస్లలో విఫలమైనంత మాత్రాన గతంలో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లపై నమ్మకం కోల్పోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ప్రపంచకప్ గెలిచిన జట్టు కాంబినేషన్ను కొనసాగించాలనే ఉద్దేశంతోనే సంజును తిరిగి తీసుకున్నామని వివరించాడు.
వైభవ్కు గంభీర్ ఏం చెప్పాడంటే..
వైభవ్ సూర్యవంశీ విషయంలో టీమ్ మేనేజ్మెంట్కు స్పష్టత ఉందని గంభీర్ చెప్పాడు. అతడి ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని, అయితే ప్రస్తుతానికి అవకాశం కోసం వేచి చూడాల్సి ఉంటుందని తెలిపాడు. కొంతకాలంగా జట్టులో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు కొత్తగా వచ్చిన వారికంటే ముందుగా అవకాశం దక్కడం సహజమని వివరించాడు.
అదే సమయంలో వైభవ్కు అవకాశం వచ్చినప్పుడు తగినంత సమయం ఇవ్వాలని కూడా భావిస్తున్నామని గంభీర్ పేర్కొన్నాడు. భారత జట్టులో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం జట్టుకు మంచిదేనని చెప్పాడు. ఆటగాడి వయసు 15 ఏళ్లైనా, 30 ఏళ్లైనా.. అవకాశం కోసం ఎదురుచూడాల్సిందేనని స్పష్టం చేశాడు.
అఫ్గానిస్థాన్ సిరీస్లో సంజు, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా కొనసాగగా.. వైభవ్ బెంచ్కే పరిమితమయ్యాడు. సంజు మూడు మ్యాచ్ల్లో 117 పరుగులు చేయడంతో పాటు రెండు అర్ధసెంచరీలు సాధించాడు.
