
DNews:31 Dec: తెలంగాణలో యాసంగి సాగు వేళ అన్నదాతలకు యూరియా కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఎరువుల కోసం రైతువేదికల వద్ద రాత్రంతా జాగరణ చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో రైతులు దుప్పట్లు కప్పుకుని, చలిమంటలు వేసుకుని రైతువేదిక వద్ద పడిగాపులు కాస్తుండగా, ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో ఇబ్బందులు పడ్డామని, కనీసం యాసంగిలోనైనా మక్క, వరి పంటలకు అవసరమైన యూరియా అందుతుందని ఆశించినా తమకు తిప్పలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వ పాలనలో బఫర్ స్టాక్ 3.50 లక్షల నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉండేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బస్తాల లెక్కన ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సుమారు 47.68 లక్షల బస్తాలు అంటే కేవలం 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమేనని, ఈ లెక్కన రాష్ట్రంలోని 12,700 గ్రామాలకు సగటున గ్రామానికి కేవలం 376 బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ భారీ కొరత కారణంగానే రైతులు రాత్రంతా రైతు వేదికలు, సహకార సంఘాల వద్ద నరకయాతన పడుతూ బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది.
