
DNews:11 Dec: బ్రిటన్ ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్కు ప్రవాస భారతీయుడు ఉదయ్ నాగరాజు సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఈ ఘన గౌరవం పొందిన ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.యూకేలో పబ్లిక్ ఆఫీస్ కోసం పోటీ చేసిన రోజుల్లోనుంచి, నేడు ఇంగ్లండ్ రాజు చేతుల మీదుగా హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యత్వం పొందే వరకు ఉదయ్ నాగరాజు చేసిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని కేటీఆర్ కొనియాడారు. కొత్త బాధ్యతల్లో అన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఉదయ్ నాగరాజు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరం గ్రామానికి చెందినవారు. హనుమంతరావు–నిర్మలాదేవి దంపతులకు జన్మించిన ఆయన వరంగల్, హైదరాబాద్ల్లో చదువుకుని, అనంతరం యూకేలోని ప్రసిద్ధ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ పూర్తి చేశారు.ఆర్టిఫిషియల్ ఇింటెలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, AI పాలసీ లాబ్స్ పేరుతో థింక్ ట్యాంక్ను స్థాపించిన ఆయన, అంతర్జాతీయ వేదికలపై విశిష్ట వక్తగా కూడా గుర్తింపు పొందారు.
బ్రిటన్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులను ఇంగ్లండ్ రాజు, ప్రధానమంత్రి సలహా మేరకు నామినేట్ చేస్తారు. నైపుణ్యం, అనుభవం, దేశం కోసం చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని ఈ పదవులకు ఎంపిక చేస్తారు. చట్టాల రూపకల్పన, ప్రభుత్వ పర్యవేక్షణ, కీలక అంశాలపై చర్చించడం వంటి ముఖ్యమైన విధులు ఈ సభ నిర్వహిస్తుంది.ఉదయ్ నాగరాజు ఎంపికతో తెలంగాణ నుంచి ప్రపంచ రాజకీయ వేదికపై మరో పేరు ప్రతిష్ఠతతో నిలిచింది.
