
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ **‘ఆదర్శ కుటుంబం’**పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రంలో కథానాయకుడి పాత్ర పరిచయంతో పాటు వెంకటేష్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ను వివరించేందుకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్తో కథలోని కీలక అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తే సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు టాక్.
ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమాలో పాత్రల పరిచయం, కథనానికి సంబంధించిన కొన్ని భాగాలకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించారు. ఆ ప్రయోగానికి మంచి స్పందన రావడంతో, అదే తరహా ఆలోచనను ‘ఆదర్శ కుటుంబం’లోనూ అమలు చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ వార్తపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ నిజమైతే మాత్రం వెంకటేష్–త్రివిక్రమ్ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ జతకానుంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి స్థాయి కుటుంబ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వెంకీ అభిమానులతో పాటు త్రివిక్రమ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
