
DNews:10 Dec: హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. తాజాగా పాతబస్తీలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో మరో యువకుడు క్రూర హత్యకు గురయ్యాడు. దేవీబాగ్ వద్ద జరిగిన ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది.నందిముస్లైగూడకు చెందిన అరవింద్ బోస్లే (30) ఓ బియ్యం దుకాణంలో పనిచేసేవాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. దేవీబాగ్ వద్దకు రాగానే అతన్ని వెంబడించిన దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో అరవింద్ అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు ప్రారంభించారు.
ఇటీవల నగరంలో హత్యలు, దాడులు పెరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్లపైనే దుండగులు దాడులు చేయడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు హామీ ఇస్తున్నారు.
