
DNews:19 Dec: చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రానికే రోల్ మోడల్గా నిలబెట్టడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాను ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేశానని తెలిపారు. చెన్నూరు మున్సిపాలిటీనీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.20 లక్షలతో భవనం నిర్మించామని, మరో రూ.20 లక్షలతో ప్రహరీ గోడతో పాటు అదనపు సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.
అంబేద్కర్ భవనాన్ని దళిత సంఘాలన్నీ వినియోగించుకోవాలని సూచించిన మంత్రి, భీమారం మండలంలో నేతకాని భవనానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీటి సమస్యలు క్రమంగా తొలగిపోతున్నాయని చెప్పారు.చెన్నూరులో మరో ప్రత్యామ్నాయ తాగునీటి వనరుల కోసం ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా చెన్నూరులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
100 పడకల ఆసుపత్రికి అవసరమైన సిబ్బంది నియామకాలపై ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో చర్చించినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. చెన్నూరు అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
