
DNews:24 Dec: మహబూబ్ నగర్ డీటీసీగా విధులు నిర్వహిస్తున్న కిషన్ నాయక్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని ఓల్డ్ బోయినపల్లి ఆర్ఆర్ నగర్ కాలనీలోని ఆయన నివాసంతో పాటు నిజామాబాద్, నారాయణఖేడ్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లోని బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఈ దాడులు జరిగాయి.
ఈ సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్ల నుండి రూ. 400 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.సోదాల్లో భాగంగా కిలోన్నర బంగారం, పెద్ద మొత్తంలో నగదు, భూములకు సంబంధించిన కీలక పత్రాలు, పెట్రోల్ బంకులు, హోటళ్లలో వాటాలను ఏసీబీ గుర్తించింది.ఏసీబీ దాడులు జరుగుతాయని ముందే పసిగట్టిన కిషన్ నాయక్, తన ఇంట్లో ఉండాల్సిన బంగారాన్ని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.
సోదాల అనంతరం కిషన్ నాయక్ను అదుపులోకి తీసుకున్న అధికారులు, బుధవారం తెల్లవారుజామున ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.కిషన్ నాయక్ను విచారించేందుకు ఏసీబీ అధికారులు త్వరలోనే కస్టడీ పిటిషన్ వేయనున్నారు. ఆయన బ్యాంకు లాకర్లను కూడా తెరిచి తనిఖీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో ఆయన డ్రైవర్ శివశంకర్ను బినామీగా అనుమానిస్తున్న పోలీసులు, ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు.
