
DNews:30 Dec: హైదరాబాద్లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వృద్ధురాలి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తిని నమ్మినందుకు, ఆమే ప్రాణాలను బలితీసుకున్న ఘోరమైన ఘటన ఇది.నాచారంలోని మల్లాపూర్ బాబానగర్కు చెందిన సూరెడ్డి సుజాత (65) అనే వృద్ధురాలు ఈ నెల 18న అదృశ్యమయ్యారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీలు మరియు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా, ఆమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్న అంజిబాబు (31) అనే క్యాబ్ డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది.
సుజాత ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అంజిబాబు, ఆమె వద్ద ఉన్న బంగారు నగలను దక్కించుకోవాలని పథకం వేశాడు.ఈ నెల 18న ఆమె ఇంట్లోకి ప్రవేశించి, సుజాతను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు బీరువాలోని ఆభరణాలను దోచుకున్నాడు.నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన బావమరిది (యువరాజు), స్నేహితుడు (దుర్గారావు) సహాయంతో మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఏపీకి తీసుకెళ్లాడు.
నిందితులు మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి దాదాపు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు తరలించారు. అక్కడ కొత్తపల్లి మరియు కృష్ణలంక మధ్య ఉన్న గోదావరి నదిలో మృతదేహాన్ని పడేసి, ఏమీ తెలియనట్లు తిరిగి హైదరాబాద్ వచ్చారు.పోలీసులు అంజిబాబును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. ఏపీకి వెళ్లిన కారు కదలికలు కూడా పోలీసుల అనుమానాన్ని బలపరిచాయి. నిందితులు చూపిన ఆధారాలతో పోలీసులు మృతదేహం కోసం గోదావరిలో గాలింపు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు అంజిబాబుతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
