
DNews:NOV 12:తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని అక్కడ జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు, అనంతరం వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పది కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నామని, ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ, వారి పూజారుల ఆలోచనల ప్రకారమే అభివృద్ధి జరుగుతోందని ఆయన తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక జరుగుతోందని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మంత్రి సీతక్క ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ, మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జోక్యం చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించాలని కోరారు. మేడారం అంటే తమకు బంధం, భక్తి, భావోద్వేగం, బాధ్యత అని పేర్కొన్న సీతక్క, పది తరాలకు సరిపడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడిన ఆమె, దేవుడిపై రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా మేడారం మహాజాతర నాటికి పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు.
