
DNews:06 Feb: మున్సిపల్ ఎన్నికల వేళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 44వ వార్డు నెహ్రూనగర్లో సమస్యలపై నిలదీసినందుకు ఒక ఓటరుపై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడు భౌతిక దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపింది.ఆదిలాబాద్ 44వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తన అనుచరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఓటరు అభ్యర్థిని అడ్డుకుని, గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. “ఎన్నికలు వచ్చినప్పుడే కనిపిస్తారా? మా ప్రాంతంలో నాలాలు పూడిక తీయడం లేదు, ఇతర మౌలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు, వీటిపై ఏం సమాధానం చెప్తారు?” అని నిలదీశారు.
దీంతో సమాధానం చెప్పలేక కాంగ్రెస్ అభ్యర్థి అక్కడి నుండి వెనుదిరిగారు. అయితే, ప్రచారంలో తమను అవమానించాడనే కక్షతో, అదే రోజు రాత్రి కాంగ్రెస్ నాయకుడి అనుచరుడు సదరు ఓటరు ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. “మమ్మల్నే నిలదీస్తావా?” అంటూ అతడిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దౌర్జన్యంతో భయాందోళనలకు గురైన బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కాంగ్రెస్ అభ్యర్థి మరియు ఆయన అనుచరుడిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రజాస్వామ్యంలో సమస్యలపై ప్రశ్నించే హక్కు ఉన్న ఓటరుపై ఇలాంటి దాడులు జరగడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
