
ప్రపంచ ఛాంపియన్షిప్లో ఐదుసార్లు పతకాలు సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తొమ్మిదో సీడ్గా బరిలోకి దిగిన సింధు 21-7, 21-11 తేడాతో ఐర్లాండ్కు చెందిన సోఫియా నోబెల్పై ఘన విజయం సాధించింది.
తొలి గేమ్లోనే సింధు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ అనవసర తప్పిదాలు చేసేలా చేసిన ఆమె.. విరామ సమయానికి 11-2తో భారీ ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తూ తొలి గేమ్ను సులువుగా కైవసం చేసుకుంది.
రెండో గేమ్లో సోఫియా కాస్త పుంజుకున్నప్పటికీ సింధు తన దూకుడును తగ్గించలేదు. 11-8తో విరామానికి వెళ్లిన ఆమె.. ఆ తర్వాత వేగం పెంచింది. చక్కటి బ్యాక్హ్యాండ్ డ్రాప్ షాట్లు, పదునైన స్మాష్లతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా రెండో గేమ్తో పాటు మ్యాచ్ను కూడా సొంతం చేసుకుంది.
మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ కూడా శుభారంభం చేసింది. తొలి రౌండ్లో భారత జంట 21-9, 21-13తో స్పెయిన్కు చెందిన పౌలా లోపేజ్-లూసియా రోడ్రిగ్జ్ జోడీని ఓడించి రెండో రౌండ్కు చేరుకుంది.
పురుషుల డబుల్స్లో ఎంఆర్ అర్జున్-హరిహరన్ జోడీ కూడా ముందంజ వేసింది. స్కాట్-రేమండ్స్ (ఐర్లాండ్)పై 21-16, 6-4తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి జోడీ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకుంది.
ఇక సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీకి తొలి రౌండ్లో బై లభించింది. దీంతో నేరుగా రెండో రౌండ్లోకి ప్రవేశించిన భారత ద్వయం.. స్కాట్లాండ్కు చెందిన అలెగ్జాండర్ డూన్-ఆడమ్ ప్రింగిల్ జోడీతో తలపడనుంది.
