
DNews:23 Jan: జనగామలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి సీతక్క పర్యటనలో భాగంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది.
జనగామ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “పల్లా గో బ్యాక్” అంటూ నిరసన తెలుపుతూ, మంత్రి సమక్షంలోనే ఆయనపై దాడికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకులు కావాలనే తమ కార్యకర్తలకు మద్యం తాగించి, పథకం ప్రకారం ఎమ్మెల్యేపై దాడి చేయించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మంత్రి సీతక్క పక్కనే ఉన్నప్పటికీ కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయి ప్రవర్తించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో జనగామలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
