
D Spiritual: Feb 25: బ్రహ్మోత్సవాల వైభవం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఎనిమిదో రోజు బుధవారం ఉదయం, శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారు ఆలయ తిరు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. నయనమనోహరంగా అలంకరించిన స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.
ఈ సందర్భంగా అర్చకులు లోకకల్యాణం కోసం స్వామివారు వివిధ అవతారాలు ఎత్తారని ఉపదేశించారు. ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదమంత్రాలు, వేదపారాయణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు సేవ ఘనంగా నిర్వహించబడింది. భక్తుల హర్షధ్వానాలతో ఆలయ ప్రాంగణం భక్తిరసమయంగా మారింది.
రాత్రి స్వామి–అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తర మాడవీధుల్లో ప్రత్యేక కల్యాణ వేదికను సిద్ధం చేశారు. వీవీఐపీ, వీఐపీ మరియు సాధారణ భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండపై పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, డీఈవో భాస్కర్ శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఆలయ అధికారులు మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి క్షేత్రం భక్తి, వైభవం, ఆధ్యాత్మిక ఆనందంతో కళకళలాడుతోంది.
