
హిందూ మతంలో వారంలోని ప్రతి రోజు ఒక నిర్దిష్ట దేవతకు, నవ గ్రహాల్లోని ఒకొక్క గ్రహానికి అంకితం చేయబడింది. ఆదివారం నుంచి శనివారం వరకు ఈ దేవతలను పూజించడం వల్ల జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజు ఒకొక్క రోజు ఒకొక్క దేవుడిని తగిన విధంగా పూజించాలని నియమాలను, పద్ధతులను కూడా పురాణాలు పేర్కొన్నాయి.
జీవితంలో దేవుడి ఆరాధనకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. దేవుని గురించి ప్రతి ఒక్కరికీ వేర్వేరు ఆలోచనలు ఉంటాయి. దేవుడిని పూజించడం వ్యక్తి నుంచి వ్యక్తికి ఒకొక్క విధంగా ఉంటుంది. కొందరికి దేవుడిని ఆరాధించడం చిన్న విషయంగా అనిపించవచ్చు. మరికొందరికి పూజ చేయడం చాలా గొప్ప విషయంగా అనిపించవచ్చు. రోజూ దేవుడికి పూజ చేయడం వలన జీవితంలో శాంతి, ఆనందం, ఆత్మవిశ్వాసం లభిస్తాయని నమ్ముతారు. హిందూ మతంలో వివిధ పురాణాల ఆధారంగా దేవుళ్ళు అవతరించారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక లక్షణాలు, ఆసక్తులు ఉంటాయని నమ్ముతారు. ఈ పరిస్థితిలో వారంలోని ఏడు రోజులు ఏ ఏ దేవుళ్ళను పూజించాలో తెలుసుకుందాం.
సోమవారం: హిందూ మతం ప్రకారం సోమవారం శివుడికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. సోమవారం రోజున శివుడిని పుజిస్తారు. శివుడికి అభిషేకం చేస్తారు. సోమవారం రోజున సమీపంలోని శివాలయానికి వెళ్లి శివయ్యను సందర్శించి అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుందని, గొప్ప పుణ్యం పొందుతారని కూడా చెబుతారు.
మంగళవారం: ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు హనుమంతుడి పూజకు చాలా ప్రత్యేకమైనది. మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలోని భయాలు, అడ్డంకులు, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. సాధ్యమైనప్పుడల్లా ఇంట్లో లేదా ఆలయంలో హనుమంతుడిని పూజించడం ప్రయోజనకరమని విశ్వాసం.
బుధవారం: ఈ రోజు విఘ్నాలకధిపతి గణపతిని పుజిస్తారు. గణపతిని పూజించడం వలన జ్ఞానం, తెలివి లభిస్తుందని నమ్మకం. ఇంట్లోనే కాదు గణపతి ఆలయాల్లో కూడా పూజ చేయడం వలన చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అవి సక్సెస్ అవుతాయని నమ్మకం. జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి గణేశుని ఆరాధన ముఖ్యం.
గురువారం: ఈ రోజు విష్ణువు రోజుగా పరిగణించబడుతుంది. విష్ణువును ఆరాధించే వారికి సామరస్యం, స్థిరత్వం, ఆధ్యాత్మిక వృద్ధికి మార్గాన్ని చూపిస్తాడు. ఈ రోజున ప్రజలు విష్ణు సహస్రనామ జపించి భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటారు.
శుక్రవారం: అమ్మవారి ఆరాధనకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున లక్ష్మీదేవి లేదా దుర్గాదేవిని పూజించడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఆ రోజు ఉపవాసం ఉండి పూజలు చేస్తే అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం.
శనివారం: ఈ రోజు శనిశ్వరుడికి అంకితం చేయబడినది. ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తారు. దేవాలయాలలో నవగ్రహాలు ఉన్న మందిరంలో పూజలు చేయడం, నువ్వుల దీపం వెలిగించడం వల్ల శనిశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
ఆదివారం: వారంలో మొదటి రోజుగా పరిగణించబడే ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. సూర్యుడిని పూజించే వారికి మంచి ఆరోగ్యం, శక్తి లభిస్తుందని నమ్మకం.
