
D News: Aug 11: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సోమవారం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇళ్ల ప్రారంభోత్సవంతో పాటు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కోసం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచాయి.
కార్యక్రమంలో ప్రసంగించిన మంత్రులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పాలకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించి మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేసిందని, ఇప్పుడు అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు.
మంత్రుల వ్యాఖ్యలపై అదే వేదికపై ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. సభలో వాస్తవ విరుద్ధమైన ఆరోపణలు చేయడం సరికాదని మంత్రుల తీరును ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. “అబద్ధాలు చెప్పకండి.. ఇది రాజకీయ ప్రసంగాలు చేసే వేదిక కాదు” అంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
దీంతో మంత్రులు, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం ముదరడంతో కార్యక్రమ వేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు పరస్పరం పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కమలాపూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు వేదికగా మారడంతో ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
