
హైదరాబాద్ శివారులో రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ పూలు, కూరగాయల మార్కెట్ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అజీజ్నగర్, హిమాయత్నగర్లో మొత్తం 39.07 ఎకరాలను మార్కెటింగ్ శాఖకు కేటాయించింది. మార్కెట్లో శీతల గిడ్డంగులు, ప్లాట్ఫారాలు, పార్కింగ్, భారీ భవనాలు, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంగా ఉండటం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తుల రవాణా, దేశీయ, విదేశీ ఎగుమతులకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ పూలు, కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతోపాటు, పూలు కూరగాయల సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ మార్కెట్ను నిర్మించనున్నారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 39.07 ఎకరాల భూమిని కేటాయించారు. మార్కెట్ నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అజీజ్నగర్లోని సర్వే నంబర్ 176/పీలో 23.22 ఎకరాలు, హిమాయత్నగర్ గ్రామంలోని సర్వే నంబర్ 151/పీలో 15.25 ఎకరాలు కలిపి మొత్తం 39.07 ఎకరాలను రెవెన్యూ శాఖ మార్కెటింగ్ శాఖకు బదలాయించింది. భూమి బదలాయింపు పూర్తవడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనపై కసరత్తు ప్రారంభించారు. మార్కెట్ నిర్మాణం, విస్తీర్ణం, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ, నిల్వ సదుపాయాలు తదితర అంశాలను డీపీఆర్లో పొందుపరచనున్నారు.
దేశంలో పూల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన బెంగళూరులోని కృష్ణరాజేంద్ర మార్కెట్ను అధికారులు ఇప్పటికే అధ్యయనం చేసినట్లు సమాచారం. అక్కడి మార్కెట్ పనితీరును పరిశీలించిన అధికారులు.. దానికంటే పెద్దదిగా, ఆధునిక సదుపాయాలతో హైదరాబాద్ మార్కెట్ను తీర్చిదిద్దే అవకాశాలను పరిశీలించారు. ప్రతిపాదిత మార్కెట్లో భారీ మార్కెట్ భవనాలు, ప్రత్యేక విక్రయ వేదికలు, లోడింగ్– అన్లోడింగ్ ప్లాట్ఫారాలు, శీతల గిడ్డంగులు, పార్కింగ్, అంతర్గత రహదారులు, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.
అజీజ్నగర్, హిమాయత్నగర్ ప్రాంతాలకు మరో ప్రత్యేకత ఉంది. ఇవి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా తరలించేందుకు అనుకూలంగా ఉంటాయి. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి పూలు, కూరగాయలను మార్కెట్కు తీసుకురావచ్చు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటం వల్ల నాణ్యమైన పూలు, త్వరగా పాడయ్యే కూరగాయలను దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు విదేశీ మార్కెట్లకు కూడా తరలించే అవకాశం ఉంటుంది.
