
DNews: Mar 06: జిన్నారం (సంగారెడ్డి) మండలంలోని గడపోతారం, కాజిపల్లి పరిశ్రమల ప్రాంతాల్లో చిరుత సంచారం స్థానిక ప్రజల్లో భయాందోళనలను కలిగిస్తోంది. గత వారం రోజులుగా కాజిపల్లి గ్రామ పరిసరాల్లోని కాజిచెరువు వద్ద చిరుత సంచరిస్తున్నట్లు పశువుల కాపరులు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. గురువారం రైతు ఎర్రొల్ల వేను పశువును దాడి చేసి చంపిన ఘటనతో స్థానిక గ్రామాలు, కార్మిక వర్గాల్లో కలకలం రేగింది.
కాజిపల్లి, గడపోతారం పరిశ్రమల ప్రాంతాల్లో సుమారు 120 పరిశ్రమలు ఉండగా, వేలాది మంది కార్మికులు ప్రతిరోజూ ఇక్కడ పనిచేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం కూడా కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్లో చిరుత రెండు వారాల పాటు సంచరించింది. ఆ సమయంలో హెటెరో పరిశ్రమలో ఉద్యోగులు దూరం నుండి గమనించి తలుపులు మూసివేశారు. అనంతరం అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు.
ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో చిరుత సంచారం ప్రారంభమవడంతో గత వారం రోజులుగా భయాందోళనలు నెలకొన్నాయి. పరిశ్రమలతో పాటు నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండటం, కార్మికులు 24 గంటలూ రాకపోకలు సాగించడం వల్ల మరింత ఆందోళన పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణించే వారు, హైదరాబాద్కు వెళ్లే వారు కూడా భయంతో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో స్థానిక ప్రజలు, కార్మికులు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ అటవీ అధికారుల తక్షణ చర్య కోసం ఎదురుచూస్తున్నారు.

