
D spiritual: Feb 13: ఇంద్రకీలాద్రి పై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి మహా శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం కలశ స్థాపన, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఉదయం శ్రీ మల్లేశ్వర స్వామి వారికి శ్రీ గంగా పార్వతి సమేతంగా మంగళస్నానాలు నిర్వహించి, నూతన వధూవరుల వేషధారణలో అలంకరిస్తారు. అనంతరం మూల హవనాలు, బలిహరణ, హారతి, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేస్తారని ఈఓ వికె శీనా నాయక్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ, మండపారాధన, కలశస్థాపన, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనాలు, బలిహరణ, హారతి, మంత్రపుష్పం శాస్త్రోక్తంగా జరుగుతాయని పేర్కొన్నారు.
నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి గురువారం విరాళాలు అందాయి. హైదరాబాద్కు చెందిన వి. సుబ్బలక్ష్మి, వి. గున్నేశ్వరరావు కుటుంబ సభ్యులు రూ. 1 లక్ష విరాళంగా సమర్పించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన గుప్త దాతలు రూ. 1,01,160 విరాళాన్ని అందజేశారు. దాతలను దుర్గమ్మవారి ఆశీస్సులతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, మెమెంటోలను అందించారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనం పలికారు.
