
D Spiritual: Feb 13: శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. “ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా” నినాదాలతో భక్తజన సందోహం మధ్య గురువారం గరుడ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తిని మండపానికి వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవలో స్వామివారిని దర్శించుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
శాస్త్రోక్తంగా, శ్రీవారి నిత్యవాహనమైన గరుడుడిపై విహరిస్తూ తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సకల పాపహరణ, మోక్షప్రాప్తి లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ ఎం. గోపినాథ్, సూపరింటెండెంట్లు వల్లంశెట్టి రమేష్బాబు, రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ డి. మునికుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ అనుంబట్టు ధనశేఖర్, కంకణ భట్టార్ బాలాజీ రంగకుమార్, ప్రధాన అర్చకులు పార్థసారథి నారాయణాచార్యులు పాల్గొన్నారు.
మోహినీ అవతారంలో కళ్యాణ వెంకన్న
బ్రహ్మోత్సవాల ఐదవ రోజు ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో పల్లకిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచ్చిపై చిన్నికృష్ణుడి అలంకరణలో ఊరేగింపుగా సాగిన ఈ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. మోహినీ అవతారంలో స్వామివారిని దర్శించుకుంటే మోహాలు తొలగి సర్వం శ్రీహరిమయం అవుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి.
వైభవంగా ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్ అమ్మవారి మాలలను శోభాయాత్రగా తీసుకువచ్చారు. గోదా కళ్యాణయాత్ర అంబారీపై మాలలను తీసుకుని ఆలయానికి చేరుకుంది. ఆలయ అర్చకులు స్వామివారి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించి మాలలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా శోభాయాత్ర
కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సంప్రదాయానుసారం లక్ష్మీకాసుల హారం టిటిడి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ అర్చకులకు అందజేశారు. పోలీసుల పటిష్ట భద్రత మధ్య శోభాయాత్రలు, ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
