
D Spiritual: Dec 26: సింహగిరిపై కొలువై ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దర్శించుకున్నారు. తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా సింహాచలం చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, ఆలయ పర్యవేక్షణాధికారి కె. వెంకటేశ్వరరావు సంప్రదాయ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కేంద్రమంత్రి భక్తుల నమ్మకానికి ప్రతీకగా భావించే ‘కప్పస్తంభాన్ని’ భక్తిశ్రద్ధలతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యం చందనపు పూతతో దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన ప్రార్థనలో దేశ క్షేమానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్నదాతలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన వెల్లడించారు.
దర్శనానంతరం ఆలయ ఆస్థాన పండితులు కేంద్రమంత్రికి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో ఆయనను ఘనంగా సత్కరించి, సింహాద్రి అప్పన్న ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
