
D Spiritual: Nov 26: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి భక్తులకు తెలియజేస్తూ, డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించబడతాయని తెలిపింది. మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనుండగా, తరువాతి ఏడు రోజులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా సర్వదర్శనం కల్పించనుంది. మొదటి మూడు రోజుల్లో SED, శ్రీవాణి దర్శనాలు రద్దు చేసి, స్థానికులకు ప్రత్యేక అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్ కు అవకాశం కల్పించింది. అలాగే వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో తిరుపతిలో SSD టోకెన్ల జారీ నిలిపివేయాలని నిర్ణయించింది.
డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు నిర్వహించే దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్లను జారీ చేస్తూ, డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలలో జరిగే ముఖ్యమైన రోజులకు ఈ డిప్ ద్వారా సర్వదర్శన టోకెన్లను ఆన్లైన్లో కేటాయిస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి దరఖాస్తు చేసేలా 1+3 విధానంలో టోకెన్లు ఇస్తుంది.
ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంది. టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, అలాగే ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ బాట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వాట్సాప్ బాట్లో ‘గోవిందా’ లేదా ‘హాయ్’ మెసేజ్ పంపి, భాష ఎంచుకుని, టీటీడీ టెంపుల్ సర్వీసెస్లో వైకుంఠ ద్వార దర్శనం (డిప్) రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. ఎంపిక చేసిన తేదీలు, పేర్లు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించిన వెంటనే ACKNOWLEDGEMENT వస్తుంది. ఒక్కో ఆధార్, మొబైల్ నంబర్కు ఒక్కసారి మాత్రమే నమోదు అవకాశం ఉంటుంది.
మొదటి మూడు రోజుల్లో SED, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలో కూడా సర్వదర్శన టోకెన్ల జారీని పది రోజులపాటు నిలిపివేసింది. జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా భక్తులు టోకెన్లు లేకుండానే సర్వదర్శనం పొందవచ్చు. ఈ రోజుల్లో SSD టోకెన్లు ఇవ్వబడవు.
జనవరి 2 నుండి 8 వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15 వేల ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేయనుంది. ఇవి డిసెంబర్ 5న ఆన్లైన్లో విడుదల అవుతాయి. వైకుంఠ దర్శనాల కాలంలో చిన్నపిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితరులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశాయి.
స్థానికులకు జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట ప్రాంతాల వారికి రోజుకు 4500 టోకెన్లు, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు కేటాయించబడతాయి. ఈ టోకెన్లు డిసెంబర్ 10 నుండి ఆన్లైన్లో అందుబాటులోకి వస్తాయి. ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రోటోకాల్ దర్శనాల విషయంలో, స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనం కల్పించనుంది. సిఫార్సు లేఖలతో వీఐపీ దర్శనాలు ఈ కాలంలో స్వీకరించబడవు. ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. అయితే భారీ విరాళం ఇచ్చిన దాతలకు మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దర్శనాలు కల్పించనున్నారు. రూ.కోటి పైగా విరాళం ఇచ్చిన వారికి రోజుకు 125 మంది వరకు దర్శనం అవకాశం ఉంటుంది. రూ.1 లక్ష నుండి రూ.99 లక్షల మధ్య విరాళం ఇచ్చిన వారికి ఖచ్చితమైన కోటా కేటాయించారు.
అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయాలకు భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
