
D News: Jul 30: జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో నమోదవుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు గురువారం ఉదయం 10 గేట్లను ఒక మీటర్ ఎత్తు వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జలవనరుల శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 46,580 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 7.371 టీఎంసీలకు చేరుకుంది. వచ్చిన వరద నీటిని దిగువకు పంపించేందుకు 10 గేట్ల ద్వారా 9,717 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు విడుదల చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టు పవర్ హౌస్ ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ మరో 29,725 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రధాన జలాశయంతో పాటు తాగు, సాగు అవసరాల కోసం వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాలకు కూడా నీటి విడుదల కొనసాగుతోంది. భీమా లిఫ్ట్-1కు 1,300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 73 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకానికి 492 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. అదేవిధంగా జూరాల ఎడమ కాలువకు 935 క్యూసెక్కులు, కుడి కాలువకు 396 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అన్ని మార్గాల ద్వారా కలిపి జూరాల ప్రాజెక్టు నుంచి మొత్తం 44,254 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదవుతోంది.
కృష్ణా నదిలో ప్రవాహం మరింత పెరగడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వేగంగా చేరుతోంది. ఈ నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.
