
D News: Jul 30: అస్సాంలో వరదలు బీభత్సం.. మృతుల సంఖ్య 78కు చేరిక: అస్సాంలో కొనసాగుతున్న వరదల కారణంగా మరో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 78కు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ బులెటిన్ ప్రకారం ప్రస్తుతం ఏడు జిల్లాల్లో మూడు లక్షల మందికిపైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. ఇదే సమయంలో రాబోయే మూడు రోజుల పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ ప్రభావం సరిహద్దు ప్రాంతాల్లోని అస్సాం జిల్లాలపై కూడా పడే అవకాశం ఉందని తెలిపింది.
అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) తాజా బులెటిన్ ప్రకారం, గత 24 గంటల్లో శివసాగర్ జిల్లాలో ఇద్దరు, గోలాఘాట్ జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 78కు చేరింది. ప్రస్తుతం శివసాగర్, చరైడియో, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, బిశ్వనాథ్, కామరూప్ (మెట్రోపాలిటన్) జిల్లాలు వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
మొత్తం 551 గ్రామాలు వరదల బారిన పడగా, రాష్ట్రవ్యాప్తంగా 3,00,031 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. చరైడియో జిల్లాలో అత్యధికంగా 1,37,561 మంది ప్రభావితులయ్యారు. ఆ తర్వాత శివసాగర్లో 84,600 మంది, జోర్హాట్లో 49,911 మంది వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 16,500 మందికి పైగా నిరాశ్రయులు 71 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతుండగా, మరో 30 సహాయక పంపిణీ కేంద్రాల ద్వారా 72 వేల మందికిపైగా బాధితులకు సహాయం అందిస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వైద్య, పశువైద్య బృందాలు రంగంలోకి దిగి బాధితులకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బులెటిన్ ప్రకారం 21,523.08 హెక్టార్ల వ్యవసాయ భూమి నీటమునిగింది. 11 వేలకుపైగా పశువులు కొట్టుకుపోగా, మరో 17 వేల పశువులు వరదల ప్రభావానికి గురయ్యాయి.
ఆగస్టు 1 వరకు భారీ వర్షాల హెచ్చరిక: జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో అస్సాంలోని టిన్సుకియా, ధేమాజీ, లఖింపూర్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. టిన్సుకియా జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అదేవిధంగా నాగాలాండ్లోని మోన్, మోకోక్చుంగ్, వోఖా జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ వర్షాల ప్రభావం చరైడియో, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్ జిల్లాలపై కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడం, ఆకస్మిక వరదలు, రాకపోకలకు అంతరాయం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.
