
D Spiritual: Apr 30: తిరుపతి నుంచి సుమారు 58 కి.మీ., పుత్తూరు నుంచి 12 కి.మీ. దూరంలో ఉన్న కార్వేటినగరం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో పురాతనమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఏకశిలతో నిర్మించారు. ఇక్కడ శ్రీకృష్ణుడు వేణుగోపాలస్వామి రూపంలో కొలువుదీరాడు. ఆలయం సుమారు 400 సంవత్సరాల నాటిదని చెబుతారు. అప్పట్లో నారాయణవనం పాలకులైన వెంకట రాజ వంశానికి చెందిన రాజు వెంకట పెరుమాళ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఆలయం తూర్పుాభిముఖంగా ఐదు అంతస్థుల రాజగోపురంతో ఆకట్టుకుంటుంది.
ప్రధాన రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన తరువాత బలిపీఠం, ధ్వజస్థంభం, గరుడాళ్వార్ దర్శనమిస్తాయి. ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, మహామండపం నిర్మాణాలు విశేషంగా కనిపిస్తాయి. గర్భాలయంలో వేణువు ధరించిన వేణుగోపాలస్వామి రుక్మిణి, సత్యభామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ విగ్రహాలను తిరుపతి సమీపంలోని నారాయణవనం ఆలయం నుంచి తీసుకువచ్చినట్లు చెబుతారు.
ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, పార్థసారథి, రేణుకా పరమేశ్వరి, అవనాక్షమ్మల ఉపాలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. మరో ప్రత్యేకతగా శ్రీకృష్ణుని పాదాల చెంత వెన్నకుండ ఉండటం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
