
D Spiritual: Apr 30: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు ఈ వసంతోత్సవాలు జరగనున్నాయి. భక్తులు రూ.150 చెల్లించి ఉత్సవాల్లో పాల్గొనవచ్చు.
మే 1న ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. రాత్రి 7.30 నుంచి 8.30 వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా విహరిస్తారు.
ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మంగళవారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో మొదటి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారిని ఆలయంలోని బుగ్గ వద్దకు వేంచేపు చేశారు.
మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి మండపంలో ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఊంజలసేవ, ఆస్థానం నిర్వహించి, అనంతరం బుగ్గ వద్ద ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
