
D Spiritual: Apr 29: కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వధూవరుడైన శ్రీ సత్యదేవుడిని వెండి గరుడ వాహనంపై, వధువు అనంతలక్ష్మి సత్యవతి దేవిని వెండి గజవాహనంపై ఆసీనులు గావించారు. పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్న శ్రీ సీతారాములవారిని వెండి పల్లకిలో ఆసీనులు గావించి సాయంత్రం 7 గంటలకు కొండ దిగువన అన్నవరం గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.
తదుపరి వధూవరులను కల్యాణవేదికకు తీసుకువచ్చి వార్షిక కల్యాణ వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన సింహాసనంపై శ్రీ సత్యదేవుడు, అనంతలక్ష్మి సత్యవతి దేవి అమ్మవార్లను ఆసీనులు గావించారు. మరో వైపు సీతారాములవారిని కూర్చోబెట్టి దివ్య కల్యాణ మహోత్సవ తంతును ప్రారంభించారు. శుభముహూర్తంలో అర్చకులు వధూవరుల శిరస్సుపై జీలకర్ర–బెల్లం ఉంచి, అనంతరం మాంగల్య ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రభుత్వ తరఫున కాకినాడ జిల్లా కలెక్టర్ హరింద్రప్రసాద్ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పించారు. దేవస్థానం తరఫున చైర్మన్ ఐవి రోహిత్, ఈఓ న్నల్ల సూర్యచక్రధర్ రావు మరియు పాలకమండలి సభ్యులు కూడా పట్టువస్త్రాలు సమర్పించారు.
దివ్య కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు, గ్రామస్తులకు ప్రసాదంగా తలంబ్రాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలంకరణలతో వెలుగొందుతూ ఉత్సవ వాతావరణం నెలకొంది.
