
DSports:ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా క్రికెట్ జట్టు దశాబ్దాల కలను నిజం చేసింది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ.. తొలిసారి వన్డే ప్రపంచ కప్ (India Women World Cup 2025) ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన తుది పోరులో బలమైన సౌతాఫ్రికా జట్టును 52 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది.
ప్రారంభ దశలో సెమీ-ఫైనల్స్కు చేరుకోవడమే కష్టంగా మారిన దశ నుంచి, టీమిండియా అంచనాలను మించి రాణించింది. ముఖ్యంగా, సెమీస్ పోరులో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను ఏకంగా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి బోల్తా కొట్టించడం భారత జట్టు ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఫైనల్లో ఒకవైపు వర్షం అంతరాయం సృష్టించినా, మరోవైపు ప్రపంచ కప్ ముద్దాడాలనే ఆశయం బలంగా నిలవడంతో.. టీమిండియా విజయం సాధించింది.
ప్రపంచ కప్ గెలవడంలో జట్టులోని ప్రతి ఒక్క క్రీడాకారిణి తమ వంతు కీలక పాత్ర పోషించారు. ఇందులో మన తెలుగు బిడ్డ, కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ఆమెకు తొలి ప్రపంచ కప్ కావడం విశేషం.
