
D Spiritual: Apr 23: దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు కేతు పూజా రుసుముల పెంపుపై తలెత్తిన వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. భక్తుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పాలకమండలి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇటీవల ట్రస్ట్ బోర్డు రాహు కేతు పూజా టికెట్ల ధరలను పెంచాలని నిర్ణయించగా ఇది పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది.
ప్రత్యేకంగా సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే రూ.500 టికెట్ను రూ.750కి, అలాగే రూ.5000 టికెట్ను రూ.6000కి పెంచాలనే యోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వెండి ధరలు పెరిగిన కారణంగా ధరలు పెంచుతున్నామని చెప్పడాన్ని భక్తులు, రాజకీయ పక్షాలు సమర్థించలేదు. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తూ పాత ధరలనే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.
రాహు కేతు పూజలు శ్రీకాళహస్తి ఆలయానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. ఏడాదికి సుమారు 10 లక్షల మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొంటారని అంచనా. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా జరిగే ఈ పూజల ద్వారా దేవస్థానానికి భారీ ఆదాయం లభిస్తుంది. ధరల పెంపుతో పాటు ‘సామూహిక పూజ’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా బోర్డు యోచించింది. అయితే సామూహిక పూజల్లో వెండి ప్రతిమలు ఇవ్వకపోవడం వంటి నిర్ణయాలు భక్తులకు నచ్చలేదు.
వివాదం తీవ్రతరం కావడంతో ఆలయ ఈవో వెంకటేశులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ట్రస్ట్ బోర్డు నిర్ణయాన్ని పునఃసమీక్షించి ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలనే కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. రూ.500 టికెట్ను రద్దు చేయడం లేదా ధరలు పెంచడం జరగదని భక్తులకు భరోసా ఇచ్చారు.
దీంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. భక్తుల సౌకర్యార్థం పాత పద్ధతిలోనే నాగేంద్రుని వెండి ప్రతిమలతో కూడిన పూజా సామాగ్రిని అందిస్తూ రాహు కేతు పూజలు కొనసాగనున్నాయి.
