
తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో కోటికిపైగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ జరగకపోవడం, డూప్లికేట్, మ్యాపింగ్ జరగని ఓట్లు ఉండడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 43 లక్షల ఓట్లు అన్కలెక్టబుల్ జాబితాలోకి చేరాయి. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా.. తేడాలున్న ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈసీ సూచించిన గుర్తింపు కార్డులు చూపించి మాత్రమే వీరు ఓటును నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే ప్రక్రియ ఆగస్టు 10తో ముగిసింది. అయితే సర్వే ఆధారంగా రాష్ట్రంలో కోటికిపైగా ఓట్లు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ కాకపోవడం, 2002 డేటాతో మ్యాపింగ్ జరగకపోవడం, అడ్రస్లో తేడాలు ఉండటం వంటి కారణాలతో భారీగా ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది. కాగా, పత్రాలు డిజిటలైజ్ కాలేదన్న కారణంతోనే ఓటు శాశ్వతంగా తొలగిపోయినట్లు భావించాల్సిన అవసరం లేదని, ముసాయిదా జాబితా, క్లెయిమ్స్, అభ్యంతరాల దశల్లో అర్హతను నిరూపించుకునే అవకాశం ఉంటుందని ఎన్నికల ప్రక్రియలోని నిబంధనలు సూచిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్ల మంది డేటా మాత్రమే డిజిటలైజ్ కాగా, మిగిలిన 74 లక్షల మంది పత్రాలను అందించకపోవడంతోవారి ఓట్లు అన్కలెక్టబుల్ జాబితాలోకి చేరాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్సుంది. ఈ జిల్లాల్లో మొత్తం 1.14 కోట్ల ఓటర్లు ఉండగా.. కేవలం 71.05 లక్షల మంది మాత్రమే బీఎల్వోలకు పత్రాలు అందించారు. మిగిలిన 43.09 లక్షల మంది వివరాలు లభించకపోవడంతో ఈ ఓట్లన్నీ తొలగిపోవడం దాదాపు ఖాయమైంది. స్థానికంగా అందుబాటులో లేకపోవడం, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం, ఓటరు మృతి చెందడం, రెండు చోట్ల ఓటు ఉండటం వంటి అంశాల ప్రాతిపదికన ఈ వివరాలను వర్గీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షలకు పైగా వలస ఓట్లు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మరోవైపు, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలించినప్పుడు ఒకే వ్యక్తికి రెండు లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నట్లు 3.18 లక్షల కేసులను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా.. గతంలో చేపట్టిన మ్యాపింగ్ సర్వేలో 89 లక్షల ఓట్లలో వ్యత్యాసాలు రాగా.. బీఎల్వోల దిద్దుబాటు అనంతరం కూడా ఇంకా 61 లక్షల ఓట్లలో భారీ తేడాలున్నట్లు తేలింది. ఇందులో గ్రేటర్ పరిధిలోనే 10 లక్షల ఓట్లు ఉండటం గమనార్హం. 11 రకాల కీలక విశ్లేషణల ఆధారంగా ఈ వ్యత్యాసాలను గుర్తించినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
డిజిటలైజేషన్ ప్రక్రియ ముగియడంతో ఆగస్టు 17న ఈసీ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. అనంతరం వ్యత్యాసాలున్న ఓటర్లకు ఈఆర్ఓ అధికారుల నుంచి నోటీసులు అందనున్నాయి. నోటీసులు అందుకున్న పౌరులు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి సమర్పించి తమ ఓటును కాపాడుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ ఓట్లు కూడా శాశ్వతంగా రద్దవుతాయి. ఈ రకంగా ముసాయిదా ప్రక్రియ పూర్తయ్యేనాటికి తొలగించే ఓట్ల సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది.
