
D Spiritual: Feb 21: హిందూ సంప్రదాయంలో శనివారం రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మన గత కర్మల ఫలితంగా కలిగే శని ప్రభావం తగ్గి, శ్రీవేంకటేశ్వరుని కృప లభించాలంటే సప్త శనివార వ్రతం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ వ్రతం ద్వారా శని దోష నివారణ, కుటుంబ శాంతి, ఐశ్వర్యం మరియు కార్యసిద్ధి కలుగుతాయని విశ్వాసం.
ఈ వ్రతాన్ని ఏ శనివారమైనా ప్రారంభించవచ్చు. ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య లేదా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వంటి శుభ నక్షత్రాల్లో వస్తే మరింత మంగళకరం. ఏలినాటి శని, అష్టమ శని, శని మహాదశ లేదా అంతర్దశలో ఉన్నవారు ఈ వ్రతం ఆచరించడం మంచిదిగా చెప్పబడింది.
వ్రతదారులు శనివారం తెల్లవారక ముందే తలస్నానం చేసి తులసి మాల ధరించాలి. పగలు నిద్ర, మధ్యాహ్న భోజనం వర్జ్యం. ఉదయం మరియు సాయంత్రం పూజ నిర్వహించి, ఉదయం చిమ్మిలి ఉండలు, సాయంత్రం ఏడు లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. పురుషులు ఈ ఏడు వారాలు క్షవరం చేయరాదు.
పూజలో ఇంటి ఈశాన్య దిశలో కలశ స్థాపన చేసి, దీపాలు వెలిగించి, పూలు, పండ్లు సమర్పించి, వేంకటేశ్వర మంత్రాలు, గోవింద నామాలు, అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం పారాయణం చేయాలి. అనంతరం శని ధ్యాన శ్లోకం, శని స్తోత్రం చదవాలి.
ఏడు శనివారాలు పూర్తైన తరువాత ఏడు మంది అతిథులను సప్తగిరులుగా భావించి భోజనం పెట్టి, సమీపంలోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు. భక్తి, నియమ నిష్టలతో ఆచరించిన ఈ వ్రతం శుభఫలితాలను ప్రసాదిస్తుంది.
