
D News: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రణబాలి’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నా.. ‘గీత గోవిందం’ తర్వాత ఆ స్థాయి భారీ విజయాన్ని అందుకోలేకపోయారు. ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘లైగర్’, ‘ఖుషి’, ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్డమ్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో ఇప్పుడు ‘రణబాలి’పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో విజయ్–రాహుల్ కాంబినేషన్లో వచ్చిన ‘టాక్సీవాలా’ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.
తాజాగా విడుదల చేసిన టీజర్ అనౌన్స్మెంట్ వీడియోలో ‘The Legend of the Cursed Land Rises’ అంటూ సినిమాను భారీ యాక్షన్ నేపథ్యంతో పరిచయం చేశారు. సెప్టెంబర్ 9న రానున్న టీజర్లో విజయ్ దేవరకొండ పాత్రను ఏ రేంజ్లో చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.
‘రణబాలి’ 19వ శతాబ్దం నేపథ్యంలో సాగే చారిత్రక కథగా ప్రచారం జరుగుతోంది. అప్పటి రాయలసీమ ప్రాంతంలోని కరవు పరిస్థితులు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఓ వీరుడి కథను ఈ సినిమాలో చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే పూర్తి కథాంశంపై మేకర్స్ నుంచి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటిష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. దీంతో సినిమా కేవలం యాక్షన్కే పరిమితం కాకుండా భారీ చారిత్రక నేపథ్యంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఈ సినిమా మరో కారణంతోనూ ప్రత్యేకంగా మారింది. వారి వివాహం తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రంగా ‘రణబాలి’పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
అక్టోబర్ 16న ‘రణబాలి’ థియేటర్లలోకి రానుంది. అంతకంటే ముందే సెప్టెంబర్ 9న విడుదల కానున్న టీజర్ సినిమాపై అంచనాలను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. విజయ్ దేవరకొండకు మళ్లీ భారీ విజయాన్ని అందించే సినిమాగా ‘రణబాలి’ నిలుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
