
D Spiritual: Sept 8: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తిశ్రద్ధలతో గణపతి మండపాలను సిద్ధం చేస్తున్న ఉత్సవ కమిటీలు, భక్తులు.. బొజ్జ గణపయ్య విగ్రహాలను మండపాలకు తరలించే సమయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. విగ్రహాల తరలింపు సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను ఎక్కువగా ప్రతిష్ఠిస్తున్నారు. అయితే మట్టి విగ్రహాలు సున్నితంగా ఉండటంతో వాటిని వాహనాల్లోకి ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విగ్రహం బేస్కు తగినంత సపోర్ట్ అందించి, ఎలాంటి కుదుపులకు విగ్రహం దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి.
భారీ గణపతి విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ తీగల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వీధుల్లోని కరెంటు తీగలు, హైటెన్షన్ వైర్లను ముందుగానే గమనించాలి. వాహనం, విగ్రహం ఎత్తును అంచనా వేసుకుని.. మార్గంలో ఉన్న విద్యుత్ తీగలు విగ్రహానికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చే ఉత్సాహంలో యువత ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకూడదు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణించడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, వేగంగా వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
విగ్రహం బరువు, పరిమాణానికి అనుగుణంగా సరైన వాహనాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అవసరానికి తగ్గట్టుగా ట్రక్కులు, డీసీఎంలు లేదా ట్రాక్టర్లను ఉపయోగించాలి. ప్రయాణ సమయంలో విగ్రహం కదలకుండా బలమైన తాళ్లు, ఇతర భద్రతా ఏర్పాట్లతో పటిష్టంగా కట్టాలి.
అలాగే విగ్రహాల తరలింపు సమయంలో డీజేలు, అధిక శబ్దాలతో ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా ఆసుపత్రులు, వృద్ధులు నివసించే ప్రాంతాలు, నివాస ప్రాంతాల వద్ద శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాలి. పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు ఇతరులకు ఇబ్బంది కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.
