
D-News: ప్రపంచ బియ్యం వాణిజ్యంలో భారత్కు ప్రాధాన్యం పెరుగుతోంది. విదేశీ బియ్యం కొనుగోలుదారులు నేరుగా భారత మార్కెట్, ఉత్పత్తి, మిల్లింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి వ్యవస్థను పరిశీలించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ (BIRC) సర్వే వెల్లడించింది.
గల్ఫ్ ఉద్రిక్తతల ప్రభావం
గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు అంతర్జాతీయ కొనుగోలుదారుల ప్రయాణాలు, సరఫరా నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి. BIRC 2026 కోసం నమోదైన విదేశీ కొనుగోలుదారులపై నిర్వహించిన సర్వేలో సుమారు 37 శాతం మంది గల్ఫ్ ప్రాంత అస్థిరత అంతర్జాతీయ వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొనే తమ నిర్ణయాలను ప్రభావితం చేసిందని తెలిపారు.
138 దేశాల నుంచి 3,317 మంది కొనుగోలుదారులు
BIRC 2026 సమావేశం అక్టోబర్ 23న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నాటికి ఈ కార్యక్రమానికి 138 దేశాల నుంచి 3,317 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు నమోదు చేసుకున్నారు.వీరిలో బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా 336 మంది ఉన్నారు. తర్వాత బెనిన్ నుంచి 179 మంది, నైజీరియా నుంచి 177 మంది నమోదయ్యారు.
పలు దేశాల నుంచి భారీ స్పందన
యూఏఈ నుంచి 145 మంది, నేపాల్, ఫిలిప్పీన్స్ నుంచి చెరో 137 మంది నమోదయ్యారు. ఇథియోపియా నుంచి 127 మంది, సౌదీ అరేబియా నుంచి 125 మంది పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా నుంచి చెరో 109 మంది కొనుగోలుదారులు నమోదు చేసుకున్నారు.
సప్లయర్లను నేరుగా కలిసే అవకాశం
ప్రపంచ వాణిజ్యంలో భౌగోళిక, రాజకీయ మార్పులు పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు తమ సరఫరా వ్యవస్థలను విస్తరిస్తున్నాయి. ఉత్పత్తి కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నేరుగా సరఫరాదారులను కలిసే అవకాశాల కోసం వ్యాపార సంస్థలు చూస్తున్నాయని సర్వే సూచిస్తోంది. దుబాయ్లో జరిగే పెద్ద అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు కొనసాగుతున్నప్పటికీ, ప్రత్యేకంగా ఒక రంగానికి సంబంధించిన సమావేశాలు కొనుగోలుదారులు, సరఫరాదారులను నేరుగా కలిపే అవకాశం కల్పిస్తున్నాయి.
భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యం
భారత్లో బియ్యం ఉత్పత్తి, మిల్లింగ్, ప్రాసెసింగ్, ఎగుమతులకు సంబంధించిన మొత్తం వ్యవస్థ అందుబాటులో ఉండటం విదేశీ కొనుగోలుదారులకు ప్రయోజనకరంగా మారుతోంది. భారత బియ్యం ఎగుమతిదారులు విదేశీ కొనుగోలుదారులతో నేరుగా సంబంధాలు ఏర్పరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలు పెంచుకునే అవకాశం ఉంది.
ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా..
ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు దేవ్ గార్గ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ కొనుగోలుదారుల నిర్ణయాల్లో భౌగోళిక రాజకీయ ప్రమాదాలు కూడా భాగమవుతున్నాయని తెలిపారు. అయితే గల్ఫ్ పరిస్థితుల కారణంగానే కొనుగోలుదారులు BIRCకు వస్తున్నారని సర్వే చెప్పడం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ ప్రదర్శనలకు ప్రత్యామ్నాయం ఏర్పడుతోందని కూడా దీని అర్థం కాదన్నారు. అయితే భవిష్యత్తులో వ్యాపార సంస్థలు తమ సరఫరాదారులను కలిసేందుకు ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా పలు ప్రాంతాలను ఎంచుకునే అవకాశం ఉందని గార్గ్ తెలిపారు.
