
DNews: Nov 20: తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారుల ఇళ్ల వద్ద బృంద సభ్యులు బొట్టు పెట్టి చీరలు అందజేయాలని ఆమె ఆదేశించారు. స్వయం సహాయ సంఘాలకు (SHG) సభ్యులు కాని మహిళలు వెంటనే సభ్యత్వం తీసుకుని చీరలు పొందాలని సూచించారు. నియోజకవర్గం మరియు మండల స్థాయిలో మహిళల స్వయం సహాయ సంఘాల ప్రాధాన్యతపై కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ప్రతి 18 ఏళ్లు పైబడిన మహిళకు చీర అందేలా చూడాలని, కొత్త లబ్ధిదారులను గుర్తించడంలో పౌర సరఫరా శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. పంపిణీ వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేయాలని, ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ క్రమశిక్షణతో, పారదర్శకంగా జరగాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో చేపట్టింది. మొత్తం ఒక కోటి మహిళలకు చీరలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి దశలో గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేయనున్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) వరకు పట్టణాల్లో పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పర్యవేక్షిస్తోంది. లబ్ధిదారులు ఆధార్ కార్డు చూపించి, ముఖ గుర్తింపు యాప్ ద్వారా నమోదు చేయించుకుని చీరలు పొందాలి. ప్రతి రోజు చీరలు పంపిణీ చేయాలని SERP స్పష్టం చేసింది.
