
DSports Dec13: ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. మెస్సీ రాక సందర్భంగా, ఆయన బస చేయనున్న చారిత్రక తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ వద్ద పోలీసులు అసాధారణ భద్రతను ఏర్పాటు చేశారు.
- మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఆయన ప్రయాణించే శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్నుమా ప్యాలెస్ వరకు ప్రత్యేక గ్రీన్ ఛానెల్ను ఏర్పాటు చేశారు.కోల్కతాలో మెస్సీ పర్యటన సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఫలక్నుమా ప్యాలెస్ పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జాయింట్ సీపీ తప్సీర్ ఇక్బాల్, డీజీపీ శివధర్ రెడ్డి వంటి ఉన్నతాధికారులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు.సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్తారు. ఇక్కడే సుమారు ఆరు గంటల పాటు ఆయన బస చేయనున్నారు. ఈ ప్యాలెస్లో ఎంపిక చేసిన దాదాపు 100 మంది అతిథులతో (ఒక్కొక్కరు రూ.10 లక్షల టికెట్ చెల్లించినట్టు సమాచారం) ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం జరగనుంది.
- ఈ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకుని మెస్సీని కలవనున్నారు.ప్యాలెస్లో కార్యక్రమం పూర్తయిన తర్వాత, సాయంత్రం 7 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ జరిగే ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా మెస్సీతో కలిసి కొంత సమయం ఆడతారని సమాచారం.కోల్కతాలో మెస్సీని చూడటానికి అభిమానులు ఎగబడటం, గందరగోళం చెలరేగడం వంటి ఘటనల దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు మరింత అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభిమానులు సహకరించి, ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని కోరుతున్నారు.
