
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. జిల్లాలో విమానాశ్రయానికి అనువైన స్థలాలను గుర్తించేందుకు ఈ నెల 7న కేంద్ర సాంకేతిక బృందం తెలంగాణలో పర్యటించనుంది. ఈ సందర్భంగా జిల్లాలో నాలుగైదు ప్రత్యామ్నాయ ప్రాంతాలను బృందం పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీరామాలయానికి ఉన్న ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విమానాశ్రయం అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించారు.
విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర సాంకేతిక బృందం నిర్వహించే స్థల పరిశీలన కీలకంగా మారనుంది. బృందం ఇచ్చే నివేదిక అనుకూలంగా వస్తే తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియపై స్థానికుల్లో ఆశలు పెరిగాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. వరంగల్ మామునూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్పోర్టుల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. అయితే కొత్తగూడెంలో అనువైన స్థలాల కొరత కారణంగా గతంలో ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ముందడుగు పడలేదు.
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించేందుకు ఈ నెల 7న కేంద్ర సాంకేతిక బృందం తెలంగాణలో పర్యటించనుంది. జిల్లాలో నాలుగైదు ప్రాంతాలను పరిశీలించి, వాటిలో అనువైన స్థలాలను గుర్తించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
కేంద్ర సాంకేతిక బృందం పరిశీలన అనంతరం ఇచ్చే నివేదిక ఆధారంగా విమానాశ్రయం ఏర్పాటుపై తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు అంశంపై మరోసారి ఆశలు చిగురించాయి.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీరాముడి ఆలయానికి ఉన్న ప్రాధాన్యం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు విమానాశ్రయం అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తుమ్మల తెలిపారు.
కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర సాంకేతిక బృందం ఇచ్చే నివేదిక అనుకూలంగా వస్తే, తదుపరి చర్యలు చేపడతామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే వరంగల్ మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని తుమ్మల తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఇండియన్ ఎయిర్ఫోర్స్, పౌర విమానయానానికి ఉమ్మడిగా ఉపయోగించే జాయింట్-యూజర్ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం రూ.2,278.14 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంతో భూసేకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది.
ఎయిర్పోర్టు విస్తరణతో పాటు ఐఏఎఫ్ రక్షణ టౌన్షిప్ ఏర్పాటుకు సుమారు 2,009 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. చిన్న ఏటీఆర్ విమానాలతో పాటు రక్షణ శాఖకు చెందిన పెద్ద విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా 9,000 అడుగుల పొడవైన రన్వే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
